రామాయణము.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము.
రామాయణము.
రామాయణము భారతీయ వాఙ్మయములో ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము.
సాహిత్య చరిత్ర
(History of Epic Literature) పక్రారం రామాయణ కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 1500 BC లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది. రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగం కాలంలో జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు. భారతదేశం లోని అన్ని భాషల యందు, అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణము నృత్య నాటకము బాగా ప్రసిద్ధము.
రామాయణము ప్రాముఖ్యం
24,000 శ్లోకాలతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మము ల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.
వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నిక గన్నవి. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్త్వములు అంతర్గతముగా నున్న పురాణములు, కథలు, కావ్యములు, పాటలు అన్ని భారతీయ భాషలలోను లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింప బడుతున్నది. ఆదికవి వాల్మీకి ప్రార్థన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.
కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
కావ్యం రామాయణం సీతాయాశ్చరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత:
రామాయణము ప్రధానముగా సీతా రాముల పుణ్యచరితము. ఆంజనేయ భక్తి భరితము. వీరిని గూర్చిన ప్రార్థనలు ఎన్నో ప్రచారములో నున్నవి. మచ్చుకు కొన్ని.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘు నందనమ్
గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్
రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్
రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రథమనీ పలువురి నమ్మిక. రమంతే సర్వేజనాః గుణైతి ఇతి రామః (తన సద్గుణముల చేత అందరినీ సంతోషింపజేసేవాడు రాముడు)అని రామ శబ్దానికి వ్యుత్పత్తి చెప్పబడింది."రామ" నామములో పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'ర' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. మూడు మార్లు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడింది.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యమ్ రామనామ వరాననే
వాల్మీకి - రామాయణ కావ్యావతరణము గురించిన కథ
క్రౌంచ పక్షులను నిషాదుడు చంపగా వాల్మీకి నోటి నుండి అప్రయత్నంగా వచ్చిన రామాయణ శ్లోకం
మహర్షి వాల్మీకి ఆదికవియే గాక వేదాంతి. దార్శనికుడు. తపస్వి. ప్రజలకు మార్గ దర్శకుడు. సంస్కర్త. కార్యాచరణ వేత్త.
ఒక నాడు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమమునకు వస్తాడు. అప్పుడు వాల్మీకి నారదుడిని ఒక ప్రశ్న అడుగుతాడు.
కఃను అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కః చ వీర్యవాన్
ధర్మజ్ఞః చ కృతజ్ఞః చ సత్యవాక్యో దృఢ వ్రతః
ఈ కాలం లో, ఈ లోకంలో గుణవంతుడు, యుద్ధంలో శత్రువుని ధైర్యంగా జయించగల్గిన వాడు, ధర్మవంతుడు, చేసిన మేలు మరువని వాడు, ఎల్లప్పుడు సత్యమునే పలికేవాడు, అనుకున్న పనిని దృఢ సంకల్పంతో చేసేవాడు ఎవడయిన ఉన్నడా..? ఉంటే వాని గురించి చెప్పు అని అడుగుతాడు.
అవియే కాక అన్ని భూతములయందు దయ కలవాడు, విద్వాంసుడు, సమర్ధుడు, ప్రియదర్శనుడు, కోపాన్ని జయించినవాడు, అసూయలేనివాడు... అలా 16 గుణములు చెప్పి అవన్ని ఉన్నవాడు ఈ భూమి మీద ఉన్నడా అని వాల్మికి మహర్షి అడుగుతాడు.
అప్పుడు నారదుడు ఇట్లా చెబుతాడు.
మహర్షీ, మీరు అడిగిన గుణములు గొప్ప చక్రవర్తులకే అసంభవము. ఇక మామూలు మనుష్యులు సంగతి చెప్పనేల..!
కానీ అలాంటి ఒక మనుష్యుని గురించి నేను మీకు చెపుతాను అని ఈ విధముగా చెప్పనారంభించెను.
ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః
నియతాత్మా మహావీర్యో ధ్యుతిమాన్ ధృతిమాన్ వశీ.
ఇక్ష్వాకు వంశములో పుట్టిన రాముడు అనే పేరుతో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన అపారమైన శక్తి కలవాడు, సంకల్పశక్తి కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, అన్ని విద్యలు తెలిసినవాడు, ఐశ్వర్యవంతుడు, శత్రువుని నిగ్రహించ గల్గిన వాడు, ఈ ప్రపంచాన్ని అంతటిని పొషించగల్గిన వాడు, సముద్రమంత గాంభీర్యం ఉన్నవాడు, హిమవత్ పర్వతమంత ధైర్యం ఉన్నవాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువయా అని సంక్షేప రామాయణాన్ని నారదుడు చెప్పనారంభిచెను.
సుమారు ఒక నూరు శ్లోకములలో సంక్షేప రామాయణాన్ని నారదుడు వాల్మికి మహర్షికి చెప్పెను. అప్పుడు వాల్మికి మహర్షి అమితానందభరుతుడయ్యెను. పటిక బెల్లం తిన్నవాని నోటికి తీపి ఎలా నిలిచి వుంటుందో అలా ఆయన హృదయమంత రామాయణం నిండిపోయెను.
ఆ మరునాడు ఆయన తన శిష్యుడు భరద్వాజునితో తమసా నదీ తీరమున వెళ్ళుచుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగ పక్షిని బాణముతో కొట్టెను. అప్పుడది విలవిలలాడుచు అసువులు వీడెను. ఆ దృశ్యమును జూచి, వాల్మీకి ముని హృదయము ద్రవించెను. మనస్సు ఆర్ద్రమయ్యెను. శోకాకులుడైన ఆయన నోట ఈ మాటలు వెలువడెను.
మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీస్సమా:
యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్
"ఓరీ కిరాతకుడా! క్రౌంచ దంపతులలో కామమోహితమగు ఒకదానిని చంపి, నీవు శాశ్వతమగు అపకీర్తిని పొందితివి"
శోక పరితప్త హృదయముతో ఆయన ఉచ్ఛరించిన ఈ మాటలు ఛందో బద్ధముగా నున్న మొదటి శ్లోకమని, అది రామాయణం వినుటవలన తటస్థించెనని సంస్కృత సాహిత్య చరిత్రలో నమ్మకము. ఆప్పుడు బ్రహ్మ దేవుడు వాల్మీకికి ఆ శ్లోక విశిష్టతను తెలిపి, శ్రీ రామ చరిత్రను కావ్య రూపమున రచింపుమని ప్రేరేపించెను. లోకములయందు పర్వతములు, నదులు ఉన్నంత కాలము ఆ రామాయణ కావ్యము ప్రకాశించునని దీవించెను.
యావత్ స్థాస్యంతి గిరయ: సరితశ్చ మహీతలే
తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి.
రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరమ్ ప్రోక్తమ్ పుంసామ్ మహా పాతక నాశనమ్
తెలుగులో
తెలుగు రామాయణాల జాబితా
మధ్యయుగంలో సంస్కృత రామాయణమును చాలా మంది తెలుగు కవులు తెలుగులోకి అనువదించారు. వారిలో మొల్ల కవయిత్రి (మొల్ల రామాయణము ), కంకంటి పాపరాజు (ఉత్తర రామ చరితము), గోన బుధ్ధా రెడ్డి (రంగనాథ రామాయణము), విశ్వనాధ సత్యనారాయణ (రామాయణ కల్పవృక్షము), వావిలికొలను సుబ్బారావు లేదా వాసుదాస స్వామి (అంధ్ర వాల్మీకి రామాయణము), ఉషశ్రీ ప్రసిధ్ధులు. ఐతే లెక్కకు మిక్కిలి ఇతర అనువాదములు, స్వతంత్ర రచనలు ఉన్నాయి. ఇక రామాయణముతో సంబంధము గల రచనలు, కీర్తనలు, పాటలు, సినిమాలు, కథలు, పేర్లు, ఊర్లు - చెప్పనవసరం లేదు.అవి అసంఖ్యాకంగా ఉన్నాయి.
తెలుగులో ఎందరో మహానుభావులు 'రామ'నామమును స్మరించి, సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంతులను, వాల్మీకిని స్తుతించి ప్రసిద్ధులైనారు. వారిలో ప్రధానముగా పోతన, మొల్ల, రామదాసు, త్యాగరాజు, అన్నమయ్య, వాసుదాసస్వామి లను పేర్కొనవచ్చును.
కావ్య విభాగములు, సంక్షిప్త కథ
రామాయణ మహాకావ్యము ఏడు కాండములు (భాగములు) గా విభజింప బడింది. వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలోనివి ఆరు కాండలు, మొత్తం 24వేల శ్లోకములు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు).ఏడవ కాండము అయిన ఉత్తర కాండము వాల్మీకి రచన కాదంటారు. కాండము అనగా చెరకుగడ కణుపు అని అర్ధము. రామాయణ కథనము చెరకు వలె మధురమైనది గనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు. ఒక్కొక్క కాండములోను ఉప భాగములు "సర్గ"లు.
బాల కాండము (77 సర్గలు) : కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము
అయోధ్య కాండము (119 సర్గలు) : కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము
అరణ్య కాండము (75 సర్గలు) : వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము
కిష్కింధ కాండము (67 సర్గలు) : రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము
సుందర కాండము (68 సర్గలు) : హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట
యుధ్ధ కాండము (131 సర్గలు) : సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము
ఉత్తర కాండము: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)
ఇక్కడ ఒక్కొక్క కాండము కథ మాత్రము సంక్షిప్తముగా ఇవ్వబడినది. ఆయా కాండములకు సంబంధించిన ప్రత్యేక వ్యాసాలలో మరింత విస్తారంగా చెప్పబడింది.
బాలకాండము
శివ ధనుర్భంగము - రవివర్మ చిత్రం
అయోధ్య నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు.కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆయన భార్యలు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు.
రావణుడు అనే వాడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని హతంచేయడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు.
కులగురువు వశిష్టుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలనూ అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగసంరక్షణార్ధమై రామ లక్ష్మణులను తనతో పంపమని కోరాడు. ముక్కుపచ్చలారని నవయువకులను పంపడానికి దశరథుడు సంకోచించినా, వశిష్ఠుని సలహామేరకు విశ్వామిత్రునితో పంపాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్రవిద్యారహస్యాలను బోధించాడు. దారిలో రామ లక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాపవిమోచనమైనది.
రామ లక్ష్మణుల రక్షణలో యాగము జయప్రథముగా జరిగింది. మారీచ సుబాహులూ, ఇతర రాక్షసగణములూ దండింపబడ్డారు. తిరుగుదారిలో రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలసి జనకుని రాజధానియైన మిథిలానగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరచి, సీతకు వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శ్రుతకీర్తి శత్రుఘ్నుల వివాహం కనుల పండుగగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామునకు తాము ఇద్దరూ విష్ణుస్వరూపులే అని తెలిసింది.
మహా వైభవముగా నలుగురు జంటలూ అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్యలో పాలన నిత్యకల్యాణముగా సాగుతున్నది.
అయోధ్యా కాండము
సరయు నది దాటుతున్న రాముడు
దశరథుడు రాజ్యభారాన్ని పెద్దకొడుకైన రామునకప్పగింపవలెనని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది. అంతటా వేడుకలు జరుగుతున్నాయి.
రాముని సవతి తల్లియైన కైకేయికి రాముడంటే ఎంతో వాత్సల్యము. కాని ఆమె చెలికత్తె మంధర కైకేయికి ఇలా నూరిపోసింది - "రాముడు రాజయితే కౌసల్య రాజమాతవుతుంది. నీ స్థానం బలహీనపడుతుంది. కనుక భరతుని రాజుగా చేసి, రాముని దూరంగా పంపే మార్గం ఆలోచించు.". ఈ మాటలు కైకేయి వంటబట్టాయి. అంతకు పూర్వము దశరధుడు ఆమెకు రెండు కోరికలు ప్రసాదించాడు. వాటిని గుర్తు చేస్తూ ఆమె దశరధుని రెండు కోరికలు కోరింది - (1) భరతుని పట్టాభిషేకము (2) రామునకు 14 ఏండ్ల వనవాసము.
దశరథునకు ఎటూ పాలుపోలేదు. దుఃఖంతో క్రుంగిపోయాడు. కాని రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి కృతనిశ్చయుడై ఉన్నాడు. రామునితోబాటు ఆత్మయైన సీత, నీడయైన లక్ష్మణుడూ వనవాసానికి బయలుదేరారు. అయోధ్యపురవాసులంతా విలపించారు.అందరివద్దా సెలవు తీసుకొని సీతారామలక్ష్మణులు సకలసౌఖ్యాలూ వర్జించి, నారదుస్తులు ధరించి వనవాస దీక్షకు సిద్ధమైనారు. దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగానది దాటించాడు. అక్కడ దశరధుడు రామునికై విలపిస్తూ స్వర్గతుడైనాడు.
మేనమామల ఇంటినుండి అయోధ్యకు వచ్చిన భరతుడు తల్లి చేసిన పనికి మండిపడ్డాడు. ఆమె ముఖం చూడడానికీ, తన ముఖం ఇతరులకు చూపడానికీ అతని మనసొప్పలేదు. సైన్యంతో అడవికి వెళ్ళి - "నీకు చెందవలసిన రాజ్యం నావంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి, అయోధ్యకు తిరిగివచ్చి మమ్మలనందరినీ ఏలుకో" అని ప్రార్థించాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు దుఃఖించాడు. కాని "తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగియవలసిందే" అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు - "14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంత వరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి, భృత్యునిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను" అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు.
సీతారామ లక్ష్మణులు మందాకినీ తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని జపతపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. వారు అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినపుడు సీతమ్మవారు అనసూయ ఉపదేశములు, ఆశీర్వచనములు గ్రహించింది.
అరణ్యకాండము
పర్ణశాలలో సీతారామలక్ష్మణుల జీవనం
శాపవశమున విరాధుడనే రాక్షసుడైన తుంబురుడు రామ లక్ష్మణులచేత శాపవిమోచనం పొందాడు. తరువాత సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుడు, అగస్త్యుడు వంటి మహర్షుల ఆశ్రమాలను దర్శించి, పిదప గోదావరీ తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు. అక్కడకి శూర్పణఖ అనే కామరూపియైన రాక్షసి వచ్చి రామ లక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు. రోదిస్తున్న శూర్పణఖ కసి తీరడానికి ఆమె సోదరులైన ఖర దూషణులనే రాక్షసులు 14 వేల మంది రాక్షసులతో రామునిపై దండెత్తారు. రాముడొకడే వారందరిని హతం చేసాడు.
శూర్పణఖ వెళ్ళి రావణునితో మొరపెట్టుకొంది. కసితో రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామ లక్ష్మణులను దూరంగా వెళ్ళేలా చేసి, తాను సీతను ఎత్తుకుపోయాడు. అడ్డు వచ్చిన జటాయువు రెక్కలు తెగనరికాడు. సీత కనిపించక హతాశులైన రామలక్ష్మణులు ఆమెను వెతుకనారంభించారు. కొనవూపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు.
దుఃఖంతో సీతను వెతుకుతున్న రామలక్ష్మణులకు కబంధుడనే రాక్షసుడు ఎదురయ్యాడు. వాడు శాపవిమోచనం పొందుతూ సుగ్రీవునితో మైత్రి చేసుకోమని చెప్పాడు. ఆపై రామలక్ష్మణులు మతంగముని ఆశ్రమంలో వారికోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి, ఋష్యమూకపర్వతానికి బయలుదేరారు.
కిష్కింధకాండము
సుగ్రీవుడు వానరరాజు. అన్న యైన వాలితో దురదృష్టవశాత్తు విరోధము సంభవించగా సుగ్రీవుడు హనుమదాది అనుచరులతోడుగా ఋష్యమూకపర్వతంపై ప్రాణభయంతో కాలం గడుపుతున్నాడు.
హనుమంతుడు రామలక్ష్మణులను కలసి, సుగ్రీవునివద్దకుతోడ్కొని వెళ్ళాడు.రాముడూ, సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానర రాజ్యం కట్టబెట్టాడు. తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకూ సీతాన్వేషణ నిమిత్తమై పంపాడు. అలా దక్షిణదిశకు వెళ్ళినవారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడూ, జాంబవంతుడూ, నీలుడూ, మైందుడూ, ద్వివిధుడూ, సుషేణుడూ వంటి మహావీరులున్నారు.
వారు అంతా కలయజూస్తూ, అనేక అవాంతరాలను అధిగమించి, స్వయంప్రభ అనే యోగిని సాయంతో దక్షిణసముద్ర తీరానికి చేరుకొన్నారు. ఆపై దిక్కు తోచకవారు శోకంలో మునిగిపోయిన వారికి జటాయువు సోదరుడైన సంపాతి కనిపించి, రావణుడు సీతను అపహరించి లంకలో దాచాడని చెప్పాడు.
ఇక నూరు యోజనాల విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటి లంకకెలా వెళ్ళాలో తెలియక వానరులు తర్జన భర్జనలు పడసాగారు. అప్పుడు జాంబవంతుడు ఈ కార్యానికి హనుమంతుడే సమర్ధుడనీ, హనుమకు అసాధ్యమైన పని లేదనీ ధైర్యం చెప్పాడు. తన శక్తి తెలిసికొన్న హనుమంతుడు మహాతేజంతో ప్రకాశించాడు.
సుందరకాండము
లంక నుండి తిరిగి వస్తున్న హనుమంతుడు
హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.
చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధపడలేక ఆత్మహత్యకు కూడా ఉపక్రమించబోతుండగా అశోక వనం కనిపిస్తుంది .
రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.
అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదిరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.
వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి. [ ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.
హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.
ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు.
"చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.
యుద్ధకాండము
లంకకు దారి ఇవ్వవలసిందిగా సముద్రునిపై కోపిస్తున్న రాముడు
హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను . తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది.
అక్కడ లంకలో రావణుడు యుద్ధము విషయమై తనవారితో చర్చింపసాగాడు. అతని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించి, సాగరముదాటి, రాముని శరణు జొచ్చెను. కానున్న లంకాధిపతివని రాముడు విభీషణునకు ఆశ్రయమిచ్చి, కానున్న లంకాధిపతిగా సాగరజలాలతో అభిషిక్తుని చేయించెను. ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో ప్రారంభమైనది. అయిదు దినములలో 100 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు గల వారధి పూర్తికాగా, వానర భల్లూకసేనల, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు. నీలుని నాయకత్వంలో ఆ సేన మరో సాగరంలా ఉండి, రామకార్యానికి సన్నద్ధమై ఉంది.
రావణుని చారుల వల్ల తెలిసిన సమాచారం ప్రకారం వానర సేనా, రామలక్ష్మణులూ అజేయులు, అసమానులు. కనుక యుద్ధం వినాశనహేతువని కొందరు హెచ్చరించారు. కాని ప్రహస్తుని నాయకత్వములోని రావణ సేనాబలం పరాజయం ఎరుగనిది. ముఖ్యంగా ప్రహస్తుడూ, ఇంద్రజిత్తూ, నికుంభుడూ - వీరిలో ఎవరైనా తప్పక రామలక్ష్మణులను కడతేర్చగలరనీ, కనుక ఇక ఇంద్రుని వజ్రాయుధాన్ని గడ్డిపోచలా తలిచే కుంభకర్ణుడూ, తనూ యుద్ధానికి రావలసిన అవుసరమే రాదనీ రావణుడి విశ్వాసం.
వానర సైనికులతో పోరాడుతున్న అతికాయుడు
ఇరు పక్షాలవారూ వ్యూహాలు సన్నద్ధం చేసుకొన్నారు. చిట్టచివరి ప్రయత్నంగా రాముడు పనిచిన అంగదరాయబారం విఫలమైనది.
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
అంటూ వానరసేన లంకను ముట్టడించింది. మహాయద్ధంతో భునభోంతరాళాలు కంపిస్తున్నాయి. వానరులచేతిలో రాక్షసవీరులు భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. అంతా విషణ్ణులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చి వారిని నాగబంధాలనుండి విముక్తులను చేశాడు.
మరునాడు హనుమంతుని చేత ధూమ్రాక్షుడూ, అంగదుని చేత వజ్రదంష్ట్రుడూ, నీలునిచేత ప్రహస్తుడూ హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడు.అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు.
అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణునిబాణాలు కుంభకర్ణుని నిలువరించాయు. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులనూ, ఊరువులనూ ఖండించగా వాడు పర్వతంలా క్రిందపడ్డాడు. వాడి క్రింద పడి ఎందరో రక్షసులు కూడా నశించారు.
శోకిస్తున్న రావణుడిని ఊరడించి మరునాడు దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిరులనే రావణ నందనులు, మత్తుడు ఉన్మత్తుడు అనే రావణ సోదరులు - అందరూ మహా శూరులు- భీకరమైన యుద్ధానికి దిగారు. వారు అంగదుని, హనుమంతుని, లక్ష్మణుని చేత హతులయ్యారు. ఇక ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దానితో అందరూ మూర్ఛిల్లారు. రామ లక్ష్మణ హనుమంతులు కూడా బ్రహ్మాస్త్రాన్ని మన్నించక తప్పలేదు. ఎలాగో తెలివి తెచ్చుకొన్న జాంబవంతుడు హిమవత్పర్వతాలలో నున్న ఓషధులు తెమ్మని హనుమకు పురమాయించాడు. హనుమంతుడు పర్వతసమేతంగా ఓషధులను తెచ్చి అందరినీ పునరుజ్జీవితులను చేసి, మరల పర్వతాన్ని యధాస్థానంలో ఉంచి వచ్చాడు.
ఇంద్రజిత్తు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని సాధించడానికి నికుంభిలా యజ్ఙం ఆరంభించాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది, హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి, యజ్ఙాన్ని భంగం చేసి యద్ధానికి తలపడ్డాడు. ఆ భీకర సమరంలో ఆకాశాన్ని బాణాలు కప్పివేశాయి. చివరకు రాముని పేరు చెప్పి సౌమిత్రి సంధించిన ఐంద్రాస్త్రంతో ఇంద్రజిత్తు తల తెగిపడింది.
రామ రావణ యుద్ధము
ఇక రావణుడు మహోదరాది మహావీరులతో యుద్ధానికి వెడలాడు. సుగ్రీవుని చేత మహోదరుడు మరణించాడు. రావణుని మహోగ్రశరధాటికివానర సైన్యము ఛిన్నాభిన్నమైనది. లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు.. అప్పుడు రాముడు తనవారిన ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ సంహారం చేసి వస్తాను" అన్నాడు. రామ రావణ సంగ్రామం ప్రళయకాలాగ్నివలే చెలరేగినది. రావణుని అస్త్రంతో లక్ష్మణుడు కూలిపోయాడు. రాముడు విలపించసాగాడు. లక్ష్మణుడు కేవలం మూర్ఛిల్లాడని ధైర్యం చెప్పి సుషేణుడు మరల హనుమను మరల గిరిశిఖరానికి వెళ్ళమన్నాడు. హనుమంతుడు శిఖరంతో సహా ఓషధులను తెచ్చి వాసన చూపగా లక్ష్మణుడు లేచి నిలబడి, "అన్నా! ఈ సాయంసంధ్యలో రావణుడు కడతేరాలి అన్నాడు".
రామునకు సహాయంగా ఇంద్రుడు మాతలిని సారథిగా పంపాడు. యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు అగస్త్యుడు "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. రాముడు దానిని మూడు మార్లు జపించాడు. రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింపసాగారు. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. రావణుని తలలు తెగి పడుతున్నా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.
రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు.
అనంతరం సీత అగ్ని ప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామలక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగివచ్చారు. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది.
పట్టాభిషిక్తులైన సీతారాములు, పరిజనసమేతంగా - జీలకర్రగూడెం గ్రామం ఆలయంలో శిల్పం
ఉత్తరకాండము
ఉత్తర రామాయణం కథ
రామరాజ్యం
శ్రీ రామ పట్టాభిషేకం తరువాత అయోధ్యలో అంతటా సుఖ సంతోషాలు వెల్లివిరిసాయి. శ్రీ రాముని పాలనలో ప్రజలు ఏ కష్టం లేకుండా సుఖంగా జీవనం సాగించేవారు. అందుకే ఇప్పటికీ శ్రేయో రాజ్య పరిపాలనకు రామ రాజ్యాన్ని ఉదాహరణగా వాడతారు. ఇలా ఉండగా ఒక రోజు రాముడు ఏకాంతసమయంలో సీతను చేరి" దేవీ! నీవు తల్లివి కాబోతున్నావు. నీ మనస్సులో ఏమైనా కోరిక ఉంటే చెప్పు. " అని అడిగాడు. అందుకు సీత " నాధా గంగా తీరంలో ఉన్న ముని ఆశ్రమాలలో పళ్ళు, కందమూలాలు ఆరగిస్తూ ఒక్కరోజు గడపాలని ఉంది. ": అంటుంది. అందుకు సరే నంటాడు రాముడు. కానీ సీత కోరిక వినగానే వ్యాకులచిత్తుడవుతాడు.
సీత గురించిన నింద
ఒక గ్రామములోని బావి దగ్గర రామ లక్ష్మణులు సీత
అక్కడనుండి సభామంటపానికి వెళ్ళిన రాముడిని విజయుడు, మధుమత్తుడు, కాశ్యపుడు, పింగళుడు, కుటుడు, సురాజు, మొదలైన వారు హాస్య కథలు చెప్పి రాముడిని సంతోషపరుస్తారు. రాముడు ప్రసన్నుడై భద్రునితో" భద్రా! నా పరిపాలన ఎలావున్నది? ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవుగదా? నిజం చెప్పు.?" అని అడుగుతాడు. అందుకు భద్రుడు" మహారాజా! సత్యసంధుడివైన నీకు నిజం చెప్తున్నాను. ప్రజలు నీ పరక్రమాలను, రావణ సంహారాన్ని వేనోళ్ల పొగడుతున్నారు. అయితే, రావణ చెరలో కొన్నాళ్ళు ఉన్న సీతను తిరిగి మీరు భార్యగా స్వీకరించడం గురించి మాత్రం రక రకాలుగా చెప్పుకొంటున్నారు. ఇలా అంటున్నందుకు నన్ను మన్నించండి" అన్నాడు. రాముడు సరేనని వారినందరిని పంపించి విషాదచిత్తుడై తమ్ముళ్ళను పిలిపిస్తాడు. వారు రావడంతోనే రాముని వదనం చూసి నిశ్చేష్టులవుతారు. రాముడు వారిని కూర్చోమని జరిగిన సంగతి అంతా వివరిస్తాడు. " లక్ష్మణా! సూర్య చంద్రులు, అగ్ని,ఇంద్రాది దేవతలు కూడా ఆమె సౌశీల్యాన్ని శ్లాఘించారు. కానీ ఆమెపై అయోధ్యలో ఇంకా అపవాదు తొలగలేదు. ప్రజాభీష్టం లేని పరిపాలన సూర్యుడులేని పగలు వంటిది. ఇప్పుడు నాకు ఆమెను పరిత్యజించడం తప్ప వేరు మార్గం కనపడ్డం లేదు. కొద్ది సమయం కిందటే సీత తనకు మున్యాశ్రమాలు చూడాలని కోరికగా ఉన్నదని కోరగా ఆమెకు సరే అని అనుమతిచ్చాను. నువ్వు మారు మాటాడక ఆమెను గంగానదీ తీరంలోని ఆశ్రమాల వద్ద వదిలిరా. ఇది నా ఆజ్ఞ" అంటాడు.
అడవుల పాలైన సీత
లక్ష్మణునితో అడవికి బయలుదేరకముందు వశిష్టుని కలవడానిజి వచ్చిన సీత
లక్ష్మణుడు మారుమాటాడక ఉదయాన్నే రథం సిద్ధం చేయమని మంత్రి సుమంతుడుకి చెప్పి సీత వద్దకు వెళ్ళి" తల్లీ. ఆశ్రమంలొ గడపాలన్న నీకోరిక మేరకు నేడు నిన్ను మున్యాశ్రమాలకు గంగా నదివద్దకు తీసుకువెళ్లమని అన్న ఆనతిచ్చారు" అనగానే సీత సంతోషంగా అతనితో గంగానదికి ప్రయాణమవుతుంది. గంగానదిని దాటిన పిదప మున్యాశ్రమతీరంవద్ద " తల్లీ! నా పాపాన్ని క్షమించు. నిన్ను నేను ఇక్కడకు తీసుకువచ్చినది ఈ తీరంలో వదిలి వెళ్లడానికే గాని తిరిగి అయోధ్యాపురికి తీసుకు వెళ్ళడానికి కాదు" అని అసలు సంగతి చెప్పగా ఆమె మూర్చపోయి తేరుకొని "నాయనా సౌమిత్రీ! నేను కష్టాలు అనుభవించడానికే పుట్టాను అని అనిపిస్తున్నది. పూర్వజన్మ పాపం పట్టి పీడించక తప్పదుమరి. అప్పుడు అరణ్యాలలో భర్త తోడుతో గడిపాను. ఇప్పుడు ఒంటరిగా ఉండగలనా? నీభర్త నిన్నెందుకు విడిచిపెట్టాడని అడిగే ముని పత్నులకు ఏమి జవాబు చెప్పేది? సరే. విధిరాత అనుభవింపకతప్పదు. ఆయన మాటను గౌరవిస్తానని చెప్పు. నా నమస్కారాలు తెలియచెయ్యి. " అంటుంది. లక్ష్మణుడు ఆమె పాదాలకు మొక్కి ప్రదక్షిణం చేసి వెళ్ళలేక వెళ్లలేక గంగా తీరం దాటి వెడతాడు.
ముని ఆశ్రమం, కుశలవులు
వాల్మీకి ఆశ్రమములో సీతా దేవి
సీత అతను వెళ్ళేంతవరకూ అక్కడే ఉండి పెద్దగా ఏడుస్తూ కుప్పకూలిపోయింది. ముని బాలకుల ద్వారా ఈసంగతి తెలుసుకొన్న వాల్మీకి ఆమెను తన ఆశ్రమానికి తీసుకొని వచ్చి" అమ్మాయీ! నీవు జనకుని కూతురువు. దశరధుని కోడలివి. రాముని ఇల్లాలువు. నీవు అతి పవిత్రురాలివి. నేను నా తపశ్శక్తితో సర్వం గ్రహించాను. నీవు నిశ్చింతగా ఉండు. ఇక్కడి మునిసతులందరూ నిన్ను కన్న కూతురివలె చూసుకొంటారు. " అని ఓదారుస్తాడు. ఆయన ఆశ్రమంలో ఉన్న అందరినీ పేరు పేరునా పిలచి జానికీ దేవికి ఎలాంటి కష్టం కలుగకుండా చూసుకొనే బాధ్యతను అప్పగిస్తాడు. అక్కడ కొంతకాలానికి జానకీ దేవి ఇద్దరు బాలలకు జన్మనిస్తుంది. వారు లవకుశనామధేయులై దినదిన ప్రవర్దమానులౌతూ అటు వేద విద్యలోనూ, ఇటు క్షాత్ర విద్యల్లోనూ తిరుగులేని బాలురుగా ప్రకాశిస్తుంటారు.
రాజసూయం
యాగాశ్వాన్ని బధించిన లవ కుశులు
ఇదిలా ఉండగా ఒక రోజు రాముడు తమ్ములను పిలిచి తనకు రాజసూయ యాగం చేయాలనున్నది అని చెపుతూ వారి సలహా అడుగుతాడు. భరతుడు అన్నకు అంజలి ఘటించి" ప్రభూ! నీ పాలనలో ధర్మదేవత చక్కగా నడుస్తోంది. కీర్తి చంద్రుడ్ని ఆశ్రియించిన వెన్నెలలా నిన్ను అంటిపెట్టుకొనే ఉన్నది. పాప కర్ములు అయిన రాజులు లేరు. ఈ భూమ్మీద ఉన్న సకల ప్రాణులకు ఏలికవు గతివి నువ్వే అని మరిచావా? రాజసూయం వల్ల అనేక రాజవంశాలు నేలమట్టం అవుతాయి. అందువల్ల రాజసూయం అనవసరమని నా అభిప్రాయం " అనగానే లక్ష్మణుడు అందుకొని" అన్నా! భరతుడు చెప్పింది నూటికి నూరుపాళ్ళూ నిజం, ధర్మయుక్తం. నీకు యాగం చేయాలని కోరిక ఉంది గనుక అశ్వమేధం చేయి. ఇది నిర్వహించి పూర్వం ఇంద్రుడు వౄతాసురవధ వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకం వదిలించుకొన్నాడు. " అంటాడు. శ్రీ రాముడికి వారి మాటలు బాగా నచ్చాయి. " సోదరులారా. మీరు చెప్పినమాటలు నాకు సమ్మతంగానే ఉన్నాయి. ఈ యాగం నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయండి. " అని అనుమతిస్తాడు.
సుగ్రీవుడు, విభీషణుడు మొదలైన దేశాధిపతులు, మునులు, నటులు, గాయకులు రాగా నైమిశారణ్యంలో గోమతీ నదీ తీరాన యజ్ఞవాటికను సమస్త వైభవోపేతంగా నిర్మించి అది చూడ్డానికి వచ్చేవారికై సకల సౌకర్యాలు సమకూరుస్తారు. మంచి లక్షణాలు కలిగిన గుర్రాన్ని రాముడు అర్చించి వదిలిపెట్టాడు. రక్షకుడిగా లక్ష్మణుడు ఋత్విజులతో సహా బయలుదేరాడు. తరువాత రాముడు యజ్ఙవాటికలోకి ప్రవేశించాడు. అప్పుడు భూమండలంపై ఉన్న రాజులు అందరూ రాముడిని అభినందించి కానుకలు సమర్పించుకోసాగారు. ఇలా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏడాది పాటు అశ్వమేధ యాగం కొనసాగింది. దీన్ని మెచ్చుకోని వారు లేరు. అప్పుడు వాల్మీకి మహర్షి శిష్యసమేతంగా విచ్చేసాడు. భరత శత్రుఘ్నులు ఆయన కోసం సౌకర్యవంతమైన పర్ణశాలను ప్రత్యేకించి నిర్మించి విడిది ఏర్పాటు చేసారు. విడిదిలోకి చేరిన తరువాత వాల్మీకి లవకుశలను కూర్చోపెట్టుకొని" చిరంజీవులారా! మీకు నేర్పిన రామాయణాన్ని రాజమార్గాల్లోనూ, మును వాసాల్లోనూ, యజ్ఞవాటిక దగ్గర రాముని మందరం దగ్గర శ్రావ్యంగా, శ్రుతి బద్ధంగా మధురంగా ఆలపించండి. రోజుకు ఇరవై సర్గలు పాడండి. ఫలాలు దుంపలే ఆరగించండి. ఎవరైనా ధనం ఇస్తే స్వీకరించకండి. మీరు ఎవరు అని ప్రశ్నిస్తే " వాల్మీకి శిష్యులం అని మాత్రమే చెప్పాలి. ప్రభువయిన శ్రీరాముడ్నిమాత్రం చులకనగా చూడకండి. అని బోధిస్తాడు.
రామాయణ గానం
రాముని సభలో రామాయణమును గానము చేయుచున్న లవ కుశులు
మరునాటి ఉదయం లవకుశులు వాల్మీకి మునికి నమస్కారం చేసి, ఆయన ఆశీర్వాదంతో రామాయణ గానం అయోధ్య నలుదెసలా ఆరంభిస్తారు. ఆ గానామృత మాధుర్యానికి జనులు సమ్మోహితులై వారిని వెంబడిస్తారు. దేశం నలుమూలలా కుశలవుల గాన మాధుర్యం గురించే చర్చ జరుగుతూంది. రాముడు కూడా ఆ గానాన్ని విని ముగ్దుదౌతాడు. యజ్ఞకర్మ పూర్తి కాగానే ఒక సభను ఏర్పాటు చేసి మునులు, రాజులు, పండితులు, సంగీత విద్వాంసులు, భాషావేత్తలు, వేదకోవిదులు, సకలవిద్యాపారంగతులు ఆసీనులై ఉన్న సమయాన రాముడు కుశలవులను తమ గాన మాధుర్యాన్ని వినిపించమని కోరతాడు. మొదటి సర్గనుంచి ఇరవై సర్గలు వరకూ వారు అతి రమ్యగా గానంచేయగా సభాసదులు చప్పట్లు చరిచి వారి గాన మాధుర్యానికి జేజేలు చెప్తారు. రాముడు భరతునితో ఈ బాలురకు పద్దెనిమిదివేల బంగారు నాణేలు బహూకరించమని కోరగా లవకుశులు తమకు ఎలాణ్టి ధనమూ కానుకలూ అవసరం లేదని తిరస్కరిస్తారు. అప్పుడు రాముడు . మీరు పాడిన కావ్యం ఏమిటి? అని ప్రశ్నించగా లవకుశులు " దీని కర్త వాల్మీకి మహర్షి. ఇప్పుడాయన ఇక్కడే ఉన్నారు. ఆయనే మాగురువు. మీ చరిత్రనే ఆయన ఇరవై నాలుగువేల శ్లోకాలుగా వ్రాసాడు. దీనిలో 7 కాండాలున్నాయి. అయిదువందల సర్గలున్నాయి. వంద కథలున్నాయి. మీకంతగా కోరిక ఉంటే పాడి వినిపిస్తాం" అన్నారు.
జానకీదేవి కళంక రహిత
మళ్ళీ కలసిన సీతా రాములు
రాముడు సరే అని అంగీకరిస్తాడు. ఆయన కోరికమేరకు వారు ప్రతిరోజూ రామాయణాన్ని గానం చేసారు. అది విని రాముడు వీరు సీతాపుత్రులే అని గ్రహించాడు. దూతలను వెంటనే పిలిచి "మీరు వాల్మీకి మహాముని వద్దకు వెళ్ళి. నామాటలుగా ఇలా చెప్పండి. మహర్షీ రాముడు నమస్కరించి మీకు విన్నవిస్తున్నదేమంటే మీ కావ్యం విన్నాను. అతి రమ్యంగా ఉన్నది. మీరు నిజంగా జానకీ దేవి కళంక రహిత అనిభావిస్తే ఆమెను సభాముఖానికి తీసుకొనివచ్చి ఆవిషయం ఆమెను నిరూపించుకోవాలి అని చెప్పగా వారు వాల్మీకిని కలసి తిరిగి వచ్చి" రేపు సీత తన నిర్దోషిత్వావ్వి ప్రకటిస్తుంది. కాబట్టి ఆమెపై అభాండాలు వేసిన వారుకూడా సభకు రావచ్చునని వాల్మీకి సెలవిచ్చారని చెప్తారు. రాముడు సభనుద్దేశించి "రేపు సీత తన నిర్దోషిత్వాన్ని ప్రకటిస్తుంది. మీరు తప్పక రావాలి" అని చెబుతాడు. ఆయన ప్రకటన విన్న వాళ్ళందరూ "ఇటువంటి ధర్మ పాలన నీకే చెల్లుతుంది" అని మెచ్చుకొంటారు. సభలోకి రాగానే శ్రీరాముడితో పాటు సభాసదులందరూ వినయంగ లేచి నిలబడి మునీశ్వరుల అనుమతితో తిరిగి ఆసీనులయ్యారు. ముగ్ద సౌందర్యమూర్తి అయిన జానకీ దేవిని చాలా కాలం తరువాత చూసిన జనులు కన్నుల నీరుడుకున్నారు. అప్పుడు హృదయభారభరితమైన మౌనాన్ని చేదిస్తూ మేఘ గంభీర స్వరంతో వాల్మీకి ఇలా అన్నారు" సభికులారా! ఈమె పరమసాధ్వి జానకీ దేవి. దశరధుని కోడలు. శ్రీరామచంద్రుని ఇల్లాలు. ఈమెను శ్రీరామ చంద్రుడు లోక నిందకు భయపడి పరిత్యజించినాడు. నేను చెప్పునది సత్యము. ఇందులో ఏమైన అనృతమున్నట్టయితే ఇన్ని వేల సంవత్సరాల నా తపస్సు నిర్వీర్యమై పోగలదు"
సభికులు మహా ముని పలుకులు విని చేష్టలు దక్కినవారయ్యారు. శ్రీ రాముడు చిరునవ్వుతో లేచి మునిని శాంతి పరుస్తూ "మునీంద్రా! దివ్యజ్ఞాన సంపన్నులైన తమ వాక్యములు సత్యభూషణములు. నా దేవేరి శీలమును గురించి నాకు ఏమాత్రమూ సందేహము లేదు. ఆమె మహా సాధ్వి అని నాకు తెలియును. మరి లోకులకు కూడా తెలియవడం అవసరమని నే నట్లు నడుచుకోవలసి వచ్చింది. ఆ తరువాత ఈ కుర్రవాళ్ళను చూస్తే నా కుమారులే అని నా అంతరాత్మ తెలుపుతూంది. లోకం కోసమే సీత తన సాధుశీలాన్ని చాటుకోవాలి" అన్నాడు. ఆ మాటలకు అంతా సీత వైపు చూసారు.
సీత భూప్రవేశం
సీత కాషాయాంబరాలు ధరించి ఒక్క మాటు చూసింది. రెండు చేతులు జోడించింది. సభా భవనంలోని గాలిలో చల్లని కమ్మని పరిమళాలు వ్యాపించసాగాయి. అప్పుడు సీత ఇలా అంది" నేను రాముడ్ని తప్ప అన్యుల్ని తలచనిదాననే అయితే భూదేవి నా ప్రవేశానికి వీలుగా దారి ఈయాలి. త్రికరణ శుద్ధిగా నేనెప్పుడూ రాముని పూజించేదాన్ని అయితే భూదేవి నా ప్రవేశానికి మార్గం చూపాలి" అని ప్రార్ధించింది సీతా దేవి ప్రార్థన ముగించీ ముగించగానే భూమి బద్దలు అయింది. నాగరాజులు మోస్తున్న దివ్య సింహాసనమొకటి పైకి వచ్చింది. దానిలో ఆసీనురాలయిన భూమాత రెండు చేతులతో సీతను తీసుకొని పక్కన పొదవి కూర్చోపెట్టుకొంది. ఆకాశం నుంచి పూల వాన కురుస్తుండగా సింహాసనం పాతాళంలోకి దిగిపోగా అక్కడ ఏమీ జరగనట్టు మళ్ళీ మామూలుగా అయిపోయింది. సభాసదులు దీనులై విలపిస్తూ రాముడి వంక చూడసాగారు. రాముడి దుఃఖానికి అంతే లేదు. "నా కన్నుల ముందే నా భార్య మాయమయింది. లంకలో నుంచి తీసుకొని వచ్చిన ఆమెను భూమినుండి తెచ్చుకొనలేనా? భూదేవీ! అత్తగారివైన నిన్ను మర్యాదగా అడుగుతున్నాను. తక్షణం సీతను తెచ్చి ఈయకుంటే జగత్ప్రళయం సృష్టిస్తాను." అన్నాడు. అప్పుడు బ్రహ్మ వారించి "రామా ! ఇది నీకు తగదు. నిన్ను స్వర్గధామంలో తప్పక కలుసుకొంటుంది. నీ చరిత్ర ఇతిహాసంగా ఉండిపోతుంది. ఇప్పటి దాకా నువ్ జరిగినది విన్నావు. ఇక జరగబోయేది కూడా మహాముని రాసి ఉన్నాడు. అది నీవు, మునులు మాత్రమే వినాలి " అని చెప్పి వెళ్ళిపోయాడు.
లక్ష్మణునికి ధర్మ సంకటం
మరునాడు మిగతా గాథ రాముడు విన్నాడు. అశ్వమేధం ముగిసింది. లవకుశులతో రాముడు అయోధ్యకేగాడు. కాలం ఎవరికోసమూ ఆగదు. ఒక నాడు ఒక ముని వచ్చి రాముడ్ని చూడాలని లక్ష్మణుడ్ని కోరాడు. రామాజ్ఞతో లక్ష్మణుడు మునిని రాముని గదిలోకి ప్రవేశపెట్టాడు. వచ్చిన ముని " రామా! మనం మాటాడే విషయాలు పరులెవరికీ తెలియరాదు. ఒక వేళ అలా మధ్యలో ప్రవేశించినా విన్నా మరణదండన విధిస్తానంటే నీతో ముచ్చటిస్తాను" అన్నాడు. రాముడు సరేనని లక్ష్మణుడ్ని ద్వారానికి కాపలాగా ఉండమన్నాడు. ఆ తరువాత ముని ఇలా అన్నాడు" రామ చంద్రా! నేను మునిని కాదు. యమధర్మరాజుని. మానవులను సమయానుసారంగా మరణాన్ని సిద్ధపరచే సమవర్తిని. నీవు ఈ లోకానికి వచ్చిన కార్య నెరవేరింది. బ్రహ్మ పుణ్యలోకాలకు వచ్చి పరిపాలించమని కోరాడు. " అన్నాడు. రాముడు నవ్వి "యమధర్మరాజా! ముల్లోకాలను రక్షించడమే నా బాధ్యత. నా స్వస్థానానికే రావడానికి నేను సిద్ధమౌతున్నాను." అన్నాడు. ఇలా వీరు సంభాషించుకొంటున్న వేళ దుర్వాసుడు రాముడి దర్శనానికి వచ్చాడు. లక్ష్మణుడు దర్శనం చేయించేందుకు వ్యవధి కావాలన్నాడు. ముక్కోపి అయిన దుర్వాసుడు "ఓరీ! ఈ.. రామ దర్శనానికి నేను వేచివుండాలా? తక్షణం నేను రాముడ్ని కలవాలి. లేకుంటే నీ దేశం, వంశం , మీ అన్నదమ్ములు నాశనం కావాలని శపిస్తాను " అన్నాడు. దుర్వాసుని కోఫం ఎరిగిన వాడైన లక్ష్మణుడు తన వంశం దేశం నాశనమయ్యే కంటే తాను రాముడు ఆజ్ఞను ధిక్కరించి తానొక్కడూ మరణశిక్షపొందడం మేలని తలచి యముడు రాముడు సంభాషణకు అంతరాయం కలిగిస్తూ " అన్నా! నీకోసం దుర్వాసుల వారు వచ్చారు" అని అన్నాడు.
లక్ష్మణుడి యోగ సమాధి
రాముడు యముని వడి వడిగా పంపి దుర్వాసునికి ఎదురేగి స్వాగతించాడు. దుర్వాసుడు తనకు ఆకలిగా ఉన్నదని మృష్టాన్నం కావాలనీ కోరాడు. ఆయనను కోరిక మేరకు తృప్తి పరచి తాను యముడికి ఇచ్చిన మాటను గుర్తుతెచ్చుకొని విచారించసాగాడు. లక్ష్మణుడు వచ్చి" అన్నా! నీవు మాట తప్పవద్దు. ఏ సంకోచమూ లేకుండా శిక్ష విధించి ధర్మాన్ని నిర్వర్తించు" అని ధైర్య చెప్పాడు. రాముడు నిలువెల్లా కుంగిపోతూ వశిష్ట, భరత, శతృఘ్నులను సమావేశ పరచి విషయం విని విచారించాడు. వశిష్ఠుడు " రాజా! ఆడి తప్ప రాదు. నీవు లక్ష్మణుడికి దేశ బహిష్కరణ విధించు." అన్నాడు. " సాధు పరిత్యాగం మరణసమానమవుతుంది కనుక నిన్ను బహిష్కరిస్తున్నాను." అన్నాడు. వెంటనే సౌమిత్రి తన ఇంటి వైపు కూడా చూడక సరాసరి సరయూ నది ఒడ్డువద్దకు చేరి యోగసమాధి అయ్యాడు. ఇంద్రుడు తన విమానంలో అతన్ని అమరావతికి తీసుకుకుపోయాడు. విష్ణు అంశలో నాల్గవభాగం తమ దగ్గరకు వచ్చినందుకు దేవతలు సంతోషించారు.
లక్ష్మణుడికి దేశ బహిష్కారం చేసాక భరతుని రాజుగా చేసి తాను కూడా వెళ్ళి పోతానని ప్రకటించాడు శ్రీ రాముడు. ఈ మాట విని యావత్తు రాజ్యం దుఃఖించింది. భరతుడయితే మూర్చపోయాడు. కొంతసేపటికి తేరుకొని భరతుడు" అన్నా! నువ్వులేని రాజ్యం నాకెందుకు? నిన్నువదిలి నేనుండలేను. కోసల రాజ్యం రెండుభాగాలు చేసి దక్షిణం కుశుడికి ఉత్తరం లవుడుకి ఇచ్చేద్దాం. ఇదే ధర్మబద్ధం . వెంటనే శతృఘ్నునికి కబురుపెడదాం. " అన్నాడు. వరసగా జరుగుతున్న ఘటనలు ప్రజలకు దిగ్భ్రాంతి కలిగించాయి. వశిష్ఠుడు " రామా! ప్రజల అభీష్టాన్ని కూడా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి"" అన్నాడు. రాజు ప్రజలతో సభ జరిపి "నా నిర్ణయం రాజ్యాన్ని త్యజించి పోవడం. మీ నిర్ణయం ఏమిటి?" అని అడిగాడు. "ప్రభూ మీ నిర్ణయమే మాకు శిరో ధార్యం. తమతో పాటు అనుసరించాలని మాలో చాలా మందికి ఉన్నది. అందుకు అనుమతించండి. అదే మాకోరిక" అన్నారు. రాముడు సరేనన్నాడు.
రాముని నిర్ణయం
ఆరోజే కుశలవులకు పట్టాభిషేకం జరిపి కొడుకులిద్దరను తొడమీద చేకొని వారి శరస్సులను ఆఘ్రూణించి వారికి హితవచనాలు చెప్పి ధనకనక వస్తు వాహనాలతో సైన్యాన్ని ఇచ్చి కుశుణ్ణి కుశాపతికి, లవుణ్ణి శ్రావస్తికి పంపాడు. తరువాత దూతల ద్వారా జరిగిన సంగతులన్నీ శత్రుఘ్నుడికి తెలియ చేసాడు. శతృఘ్నుడు మంత్రి పురోహితులను పిలచి తన అన్నతో తానూవెళ్ళిపోతానని తెలిపి తన రాజ్యాన్ని రెండుగా విభజించి మధురను సుబాహుడికి, విదిశానగరాన్ని చిన్నవాడు శత్రుఘాతికీ ఇచ్చి అభిషిక్తులను చేసాడు. రాముడు వెళ్ళి పోతున్నాడన్న విషయం తెలిసిన వానరులు, భల్లూకాలు, రాక్షసులు తండోప తండాలుగా అయోధ్యకు తరలి వచ్చారు. అంగదుడు చేతులు జోడించి" రామా ! అంగదుడికి నా రాజ్యం అప్పగించి వచ్చేసాను. నన్నూ నీతో తీసుకొని పో" అన్నాడు. రాముని వద్దకు విభీషణుడు వచ్చి ఏదో రామునికి చెప్పబోగా రాముడు వారించి "విభీషణా సూర్యచంద్రులున్నంత దాకా , నా కథ ఈ లోకంలో ప్రజలు చెప్పుకొన్నంత కాలం నువ్ ధర్మబధ్ధమైన పాలన గురించి కూడా పొగిడేలా చక్కని రాజ్య పాలన చేయాలి. ఇది స్నేహితునిగా నా ఆజ్ఞ. అంతే కాదు మా ఇక్ష్వాకువంశ కులనాధుడు జగన్నాధుడు. ఆయనను సదా సేవించడం మానకు." అన్నాడు. అప్పుడు ఆంజనేయుడిని పిలిచి" నాయనా!నీవు, మైందుడు , ద్వివిదుడు. మీ ముగ్గురూ కలికాలం అంతమయ్యేదాకా చిరాయువులై ఉండండి. అని ఆశీర్వదించి, మిగిలిన వానర భల్లూక వీరులనందరినీ తనతో తీసుకొని వెళ్ళడానికి అనుజ్ఞ ఇచ్చాడు.
రామావతార పరిసమాప్తి
మరునాడు తెల్లవారింది. బ్రాహ్మణులు అగ్ని హోత్రాలు, వాజపేయచ్చత్రాన్ని పట్టుకొని ముందుకు నడుస్తుండగా రాముడు సన్నని వస్త్రాలు ధరించి, చేతి వేళ్ళ మధ్య ధర్భలు పట్టుకొని, మంత్రోచ్చారణ చేస్తూ వెడుతునాడు. ఆయనకు రెండు పక్కలా శ్రీ దేవి, హ్రీదేవి, ముందు భూదేవి ఉన్నారు. ధనుర్భాణాలు పురుష రూపంతో ఆయన్ని అనుగమించినాయి. వేదాలు, గాయత్రి , ఓంకారవషట్కారాలు ఆ పురాణ పురుషుణ్ణి అనుసరించాయి. బ్రహ్మర్షులు, విప్రులు, భరత శత్రుఘ్నులు, అంతఃపుర ప్రజలు, వానరులు, జనగణం, రాక్షసులు ఆమర్యాద పురుషోత్తముని వెంట నడిచారు. అయోధ్యలో ఉన్న పశు పక్ష్యాదులు కూడా రాముని వెంట పోగా అయోధ్య అంతా పాడుపడినట్టు ఖాళీ అయిపోయింది. శ్రీ రాముడు అర్ధ యోజన దూరం నడచి, పడమట దిక్కుగా ప్రవహిస్తున్న సరయూ నది చేరుకొన్నాడు. అప్పటెకే దేవతలతో ముని బృందాలతో బ్రహ్మదేవుడు అక్కడ వేంచేసి ఎదురుచూస్తున్నాడు. ఆకాశం దివ్య విమానాలతో నిండిపోయింది. అర్చకుల మంత్రోచ్చారణలు జరుపుతునారు. దేవతలు దుందుభులు మోగించారు. పరిమళాలతో గాలి చల్లగా వీస్తోంది. పూలవాన కురవడం మొదలయింది. అప్పుడు సరయూ నదిలోకి పాదాన్ని పెట్టాడు రాముడు. బ్రహ్మ అప్పుడు రామునితో ఇలా అన్నాడు" మహావిష్ణూ ! నీకు శుభమగుగాక! నీ తమ్ముళ్ళతో కూడా స్థూల శరీరాలు విడిచి దివ్యశరీరాన్ని ధరించు. నీకు కావలసిన రూపం అందుకో తండ్రీ!సకల భువనాలకూ నువ్వే ఆధారం."
పితామహుడి మాటలు విని రాముడు వైష్ణవ రూపం స్వీకరించాడు. సోదరులుకూడా అలాగే చేసారు. కిన్నెరులు కింపురుషులు, యక్షులు, దేవతలు ఇలా సకల లోకాలకు చెందినవారంతా జయజయ ధ్వానాలు చేసి విష్ణువుకు భక్తిగా మొక్కారు. అప్పుడు బ్రహ్మతో విష్ణువు "నావెంట వచ్చిన వారంతా నా భక్తులు. సర్వం త్యజించి నన్ను అనుసరించినవారు. వారికి పుణ్యలోకాలు ప్రసాదించు" అని అజ్ఞాపించాడు. బ్రహ్మ రెండుచేతులా విష్ణువుకు మొక్కి"దేవా! నిన్ను నమ్మిన వారు ఆశ్రయించినవారు పశువులైన పక్షైనా సంతానకమనే దివ్యలోకం చేరతారు. ఇప్పుడు వీరినందరినీ ఆ లోకానికే చేరుస్తాను. వానరాదులు ఏ దేవతాంశం నుంచి జన్మించారో ఆ దేవతాంశం పొందుతారు. సుగ్రీవుడు సూర్యునిలో లేనమై పోతాడు" అన్నాడు. రాముడ్ని అనుసరించిన వారు " గో ప్రతారం " అనే తీర్ధంలో మునిగారు. వాళ్ళకి పూర్వ శరీరాలు పోయి దివ్యశరీరాలు వచ్చాయి.అప్పుడు వారు తమకు కేటాయించిన విమానాల్లో పుణ్యలోకాలు వెళ్ళిపోయారు.
రామాయణ కావ్యంలోని నీతి
ధర్మము, అర్ధము, కామము, మోక్షము అనునవి పురుషార్ధములు. జీవితం యొక్క గమ్యం మోక్షం పొందడం. మోక్షాన్ని పొందడానికి ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించుటకు అర్ధమును, కామమును జయించాలి.
ఏ పురుషుడైనా ఏకపత్నీవ్రతుడైయుండాలి.
సత్యము చెప్పడం, మాటపై నిలబడటం
తండ్రి మాట జవదాటరాదు.
సినిమాలు
లవకుశ
సంపూర్ణ రామాయణము
సీతారామ కళ్యాణము
సీతా కళ్యాణం
శ్రీరామ పట్టాభిషేకము
పాదుకా పట్టాభిషేకము
శ్రీరామాంజనేయ యుద్ధము
రామాయణం (బాల)
శ్రీరామరాజ్యమ్
రామాయణమునకు సంబంధించిన స్థలాలు, గుడులూ
అయోధ్య
భద్రాచలము
రామేశ్వరము
చిత్రకూటము
లంక
రామసేతు
లంక: నేటి శ్రీలంక యే రామాయణములో చెప్పిన లంక అని హిందువులు భావిస్తారు. శ్రీలంకలో రామాయణానికి సంబంధించిన చారిత్రిక కథలు స్థలాలు కనిపిస్తాయి. 1. ఋషి పులస్తి (రావణుని తాత) విగ్రహము 2. విస్రవాసముని (రావణుని తండ్రి) విగ్రహము 3. అశోకారణ్యము 4. రావణ జల పాతాలు - రావణ గుహలు 5.చారియత్ పాత్ (సీతాదేవిని మండోదరి కోట నుండి అశోకవనానికి తీసికెళ్లిన దారి)
చిత్ర కూటము: శ్రీరాముడు అరణ్యవాసములో మొదటి 12 సంవత్సరములు ఈ ప్రాంతము లోనే ఉన్నాడని హిందువుల నమ్మకం. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రములో చిత్రకూతట్ జిల్లాలో కాశికి దగ్గరలో ఈ అటవీ ప్రాంతము ఉంది. ఇప్పటికీ ఇది దట్టమయిన ఆటవీ ప్రాంతము. ఇక్కదడ భరత్ కుండ్, సీతాకుండ్, హనుమాంధార ఇంకా అనేక ప్రాంతాలు సీతారాములు తిరిగిన ప్రదేశాలుగా గుర్తింపబడినవి.
ఏకశ్లోకీరామాయణం
రామాయణం ఒక్క శ్లోకంలో!
ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్ ||
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ ||
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ |
పశ్చాద్రావణకుంభకర్ణహననం ఏతద్ధి రామాయణమ్ ||
రామాయణంలో పాత్రలు
సీత
రాముడు
లక్ష్మణుడు
హనుమంతుడు
రావణుడు
లౌకికవాదం
ఇటీవల ఐ-సర్వ్ అనే ఆధ్యాత్మిక సంస్థ ఒక అమెరికన్ సాఫ్టువేర్ లో పంచాగాన్ని ఉపయోగించి శ్రీరాముడు క్రీస్తు పూర్వం 5114 లో జనవరి 10 న జన్మించాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిని పలువురు విభేదించారు. రాముడి ఉనికి అవాస్తవమని, భారతీయ సంస్కృతి - మనిషి సత్ప్రవర్తన - కుటుంబవ్యవస్థ పటిష్ఠత కోసం వ్రాయబడిన రామాయణం కేవలం కల్పిత కథ అని, వాల్మీకి రాముడి సమకాలీకుడు కాదని, క్రీస్తు పూర్వం 5114 నాటికి ఎటువంటి లిపి అభివృద్ధి కాలేదని, ఆప్పటికి ఆర్యులు భారతదేశంలోకి అడుగుపెట్టలేదని, వారి అధికార భాష అయిన సంస్కృత భాష భారతదేశంలో లేదని, రామసేతు ప్రకృతిసిద్ధంగా ఓషన్ కరెంట్స్ వల్ల ఏర్పడిన షోల్ అని, రామసేతు వంటి షోల్స్ ప్రపంచంలో చాలా ఉన్నాయని, రామాయణ కథ జరిగినట్లు కచ్చితమైన ఆధారాలు లేవని కొంతమంది తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతున్నారు. ఏ కవి అయినా తన కావ్యంలో సహజమైన ప్రదేశాలను లిఖిస్తాడని, తాను మరణించిన తర్వాత అవి కాలగర్భంలో కలిసిపోయి వేల సంవత్సరాల తర్వాత త్రవ్వకాల్లో బయటపడినప్పుడు ఆ కావ్యం చరిత్రలా అగుపిస్తుందని, మునుషులు మరణించినా ప్రదేశాలు అలాగే ఉంటాయని, అసలు లంక అనగా సముద్రతీర ప్రాంతమని, రామాయణంలో లంక అని వ్రాసియుంది కాని శ్రీలంక అని లేదని మరికొందరి అభిప్రాయం.
సంస్కృతంలో ఇతర రామాయణాలు
సంస్కృత సాహిత్యంలో వాల్మీకి రామయణం తరువాత అంతగా ప్రసిద్ధంకాని రామాయణాలలో పేర్కొనదగినవి:
అద్భుత రామాయణం
ఆనంద రామాయణం
ఆధ్యాత్మిక రామాయణం లేక భుసుండి రామాయణం.
మహా రామాయణం లేక యోగ వాశిష్థము.
అద్భుత రామాయణం
ఇది అన్ని రామాయణాలలో కన్న చిన్నది; నిజానికి ఇది వాల్మీకి రామాయణానికి అనుబంధమయినట్టు- అద్భుతోత్తర కాండమని చెబుతారు. ఇది 27-సర్గలది. దీనిలోని ప్రధానభావాలలో ఒకటి పరాశక్తిగా సీతాదేవి మహత్యాన్ని చిత్రించడం. ఈమె ఈ పరాశక్తి అవతారంలో మహాభయంకరుడైన సహస్రకంఠరావణుడ్ని సంహరిస్తుంది. సీతాసహస్ర నామస్తోత్రం ఒకటి ఈ అద్భుత రామాయణంలో చెప్పబడింది. నారదుని ద్వారా సంగీత కళయొక్క భక్తితత్వం దీనిలో చెప్పబడింది. రాముడు పరశురామునికి, హనుమంతునికి తన విశ్వరూపాన్ని, తక్కిన అవతారాలను చూపుతాడు. దశగ్రీవరావణుని మించిన రావణుల వినాశంలో వానరులయొక్క సీతాదేవి యొక్క పాత్రను అద్భుతీకరించే కధలున్ను ఈలాంటి రామాయణమే థాయిలాండ్ లోని రామాయణకుడ్య చిత్రాలకు కారణమయినది; త్యాగరాజు ల వారు ఈలాంటి కధలను మనస్సులో పెట్టుకొనే శ్రీజనకతనయే అని, కలకంఠీ రాగం లోను, దేవి తనపదభోక్తం అని శాహనరాగం లోను పాడిఉంటారని పరిశోధకుల అభిప్రాయం.
ఆనంద రామాయణం
ఆనంద రామాయణం కుడా అద్భుత రామాయణం లానే రామకధలోని, రాముని చర్యలలోని మతతత్త్వ అద్భుతాంశాలనే వర్ణింస్తుంది. కాని ఇది అద్భుత రామాయణం కన్నా చాలా విస్తృతం. ఇది శివపార్వత్య సంవాదరూపంలో ఉన్న 109 అధ్యాయాల, 9 కాండల గ్రంథం. భక్తి వేదాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం, రాముడు పరబ్రహం.రామమంత్రం, రామసహస్రనామస్తోత్రంతో పాటు పెక్కు స్తోత్రాలు, పూజావిధి, రామనామజపం, పెక్కు కొత్తకధలు -వీటిలో కొన్ని రాముని సోదరులకు సంబంధించినవి. రాముని దక్షిణభారతయాత్రలో దక్షిణాపధంలోని క్షేత్రాలపేర్లు, ముఖ్యంగా తమిళనాడులోని క్షేత్రాల పేర్లు దీనిలో విస్తారంగా వర్ణితంకావటం గమనింపతగ్గ విషయం. రాముడు 15 శ్లోకాలలో సీతకు వేదాంత తత్త్వం ఉపదేశిస్తాడు. దీనిని దేహరామాయణమని దీనిని ప్రతివాడు తనలో భాగంగా చేసుకోవాలని, మనస్సులో దీనిని దాచుకోవాలని అంటాడు.
ఆధ్యాత్మిక రామాయణం లేక భుసుండి రామాయణం.
ఆనంద, అద్భుత రామాయణాలతో పోల్చి చూస్తే ఆధ్యాత్మిక రామాయణం చాలా వ్యాప్తి చెందినట్లు తెలియుచున్నది. దీనిని పారాయణం చేసేవారు, పూజించేవారు, వ్యాఖ్యానించేవారు ఎక్కువ. దీనికి వ్యాఖ్యలు కూడా చాలా ఉన్నాయి. తమిళ, మలయాళ, హిందీలోని రామాయణాలు- హిందీలో తులసీదాసు రామచరిత మానసం, మలయాళంలో ఎళుతుచ్చన్ ఆధ్యత్మరామాయణ కిళిపాట్టు వంటివి-ఆధ్యాత్మిక రామాయణానికి అతిసన్నిహితమైనవి.
ఈ ఆధ్యాత్మిక రామాయణం పేరుకు తగ్గట్టు రాముణ్ణి పరబ్రహ్మగా నిరూపించి, రామగీతవంటి ఆధ్యాత్మికోపదేశాలు కూడా చేస్తుంది. ఆధ్యాత్మిక రామాయణం శివుడు ప్రాస్వతికి ఉపదేశించినట్లు రచింపబడింది. తులసీదాసు రామచరిత మానస ఉత్తరకాండలో కాకభుసుండని కధ వస్తుంది. ఈ కాకభుసుండుడు గరుడునితో రామమహత్మ్యం గురుంచి, రామభక్తిని గురుంచి చర్చిస్తూ, తన జీవితం, తాను ఎలా కాకి అయిపుట్టిందీ తెలియజేస్తాడు. కాకభుసుండుని కధ, దానిదైవమూలం యోగవాశిష్ఠం చివర నిర్వాణకాండ ప్రథమభాగం 14-27 అధ్యాయాలలో చెప్పబడ్డాయి.
ఈకాకభుసుండుడు ఎవడు? అన్న ప్రశ్నకు సమాధానం ఆది రామాయణం అని లిఖిత పుస్తకాలలో కనిపించే సంస్కృతం రామాయణంలో లభిస్తుంది.ఈ రామయణం లిఖితపత్రులు ఎక్కువగా లేకపోయినా, సమగ్రమైనవో, అసమగ్రమైనవో బరోడా, ఉదయ్ పూర్, జైపూర్, మధురా, రేవా, అయోధ్య, బనారస్, కలకత్తా, లండన్ లిఖిత గ్రంథాలయాలలో లభిస్తున్నాయి.
మహా రామాయణం లేక యోగ వాశిష్థం
యోగ వాశిష్థములో రామునికి ఆయన గురువు వశిష్ఠుడు తత్త్వోపదేశం చేస్తాడు.ఈ మహారామాయణం పూర్తిగా జ్ఞాన మార్గాన్ని వర్ణించటం వల్లనే దీనికి మహారామాయణమని, జ్ఞాన వాశిష్థమని, యోగవాశిష్ఠమని, మోక్షోపాయనమని పేర్లు వచ్చాయి. ఇది 6 ఖంఢాల మహాగ్రంధం. రసవత్తరమైన శైలిలో ఆఖ్యానోపాఖ్యాలతో హృదయంగమంగా ఉంటుంది. దృష్టివాదం-సృష్టివాదం వంటి గహన తత్త్వ విషయాలను ఇది చెబుతున్నది. దీనిని విద్యారణ్యుడు విశేషంగా ఉదహరించారు. మొగల్ చక్రవర్తుల కాలంలో దీనిని సన్యాసులు హెచ్చుగా ఆదరించారు. అక్బర్ చక్రవర్తి, దారా శిఖోహ్ దీని విషయాలను శ్రద్ధగా వినేవారని చరిత్రకారులు వ్రాసారు. దీనినే పారశీక భాషలోకి అనువదించారు కూడా.
వాశిష్ఠ రామాయణం
వాశిష్ఠ రామాయణం అనేది ఆధ్యాత్మికంగా మిగతా రామాయణాలకి భిన్నం. ఇది 7 అధ్యాయాల గ్రంథం. దీనిని వశిష్ఠోత్తర రామయణం అని కూడా అంటారు. దీనికే శతముఖ రావణచరితం, సహస్రముఖ రావణ చరితం, సీతా విజయం ' అనే పేర్లు ఉన్నాయి. దీనిలో సీత శతకంఠ రావణుని ధ్వంసం చేస్తుంది. కొన్ని లిఖిత పుస్తకాలు దీనిని జైమిని భారతంలో భాగంగా, కొన్ని స్కంద పురాణం లోని వశిష్ఠ సంహితలో భాగంగా పేర్కొంటున్నవి.
ఇవే కాక రామాయణానికి సంబంధించి పలు ఇతర గ్రంథాలు సంస్కృతంలో రచింపబడినవి.అందులో ముఖ్యంగా:
మైరావణ చరిత్ర
మైరావణ చరిత్ర, లేక అహిమహిరావణ చరిత్ర అనే పేరుతో చాల లిఖిత పుస్తకాలున్నాయి. ఇటీవలి వరకు దీనిని హరికధగా చెప్పేవారు. దీనిని జైమిని భారతంలో భాగంగా పేర్కొన్నారు. కాని కొందరు పండితులు దీనితో ఏకీభవించరు.
కుశలో పాఖ్యానం
కుశలో పాఖ్యానము అనే రామకధకు సమబందించిన భాగం మరొకటున్నది. ఇది జైమిని భారతంలో భాగం. జైమినీయ అశ్వమేధంలో ఈ కుశలో పాఖ్యానము 25-36 అధ్యాయాలుగా ముద్రితమైనది. జైమినీయ అశ్వమేధంలోని ప్రధాన ఇతివృత్తం యుధిష్థరుడు పట్టాభిషేకం తర్వాత అశ్వమేధయాగం చేయటం, ప్రసక్తాను ప్రసక్తంగా ఇందులో రామాశ్వమేధకధ చెప్పబడింది. ఈ కధలో పద్మపురాణంలోని పాతాళఖండంలో ఉన్న కధలలోలాగ రామపశ్చాత్తాపం, సీతారామ లవకుశ సమాగమం, రాముడు సీతా సమేతుడై అశ్వమేధయాగం ఆచరించటం వర్నితమయినాయి.
ఇవే కాకుండా, "సత్యోపాఖ్యానం, రామరాజ్యం, దేవీ భాగవతం, పద్మపురాణం, స్కంద పురాణం" మొదలగు గ్రంథాలలో రామకధను వివరించుట జరిగింది.
. ధన్యవాదములు .