కంది పప్పుచారు:

కావలసిన వస్తువులు:

ధనియాలు - ఒకటిన్నర టీ స్పూను

ఆవాలు - ఒక టీ స్పూను

మెంతులు - అర టీ స్పూను

జీలకర్ర - ఒకటిన్నర టీ స్పూను

వెల్లుల్లి - అయిదు రెమ్మలు (దంచి పెట్టుకోవాలి)

కరివేపాకు - పది ఆకులు

పచ్చి మిర్చి - మూడు (నిలువుగా చీల్చి పెట్టుకోవాలి)

ఉల్లిపాయలు - నాలుగు (చిన్నవి)

పసుపు - అర టీ స్పూను

ఉప్పు - తగినంత

కారం - ఒకటిన్నర టీ స్పూను

సాంబారు పొడి - మూడు టీ స్పూనులు

చింతపండు - 50 గ్రాములు

వంకాయలు - మూడు (మధ్యరకం సైజువి)

మునగకాయలు - నాలుగు కాయలు (మధ్యరకం ముక్కలు)

బెండకాయలు - పది కాయలు (మధ్యరకం ముక్కలు)

ముల్లంగి - రెండు (చక్రాల్లా తరిగినవి)

టొమేటో - అయిదు (నిలువుగా కోసిన ముక్కలు)

కంది పప్పు - రెండు వందల గ్రాములు (మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి)


తయారు చేసే విధానం:

ముందుగా బాణలి తీసుకుని, నాలుగు స్పూనుల నూనె వేసి పోపు దినుసులన్ని ఒకొక్కటిగా వేసి కమ్మని వాసన వచ్చే వరకు వేయించాలి. తరువాత తరిగిన కూరగాయలన్ని ఒకొక్కటిగా వేసి ఆ పోపులో అయిదు నిమిషాలు వేయించాలి. తరువాత కొద్దిగా పసుపు, కారం వేసి ముక్కలన్ని కలియ పెట్టాలి. ఉప్పు పైన చల్లి, మరలా కలియబెట్టి మూత పెట్టి స్టవ్ మంట తగ్గించి పది నిముషాలు ఉంచి స్టవ్ ఆపి వేయాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని, దానిలో ఉడికిన కంది పప్పు ముద్ద వేసి, నీరు కాస్త కలపి స్టవ్ మీద పెట్టాలి. కాసేపటి తరువాత పక్కన ఉంచిన ఉడికిన కూరగాయలన్ని ఈ మరుగుతున్న పప్పులో వేయాలి. అయిదు నిమిషాలు మరిగిన తరువాత ఒక సారి కలియబెట్టి ఉడుకుతున్నప్పుడే సాంబారు పొడి, చింత పండు రసం కలపి బాగా కలియబెట్టాలి. ఇంకొక పది నిమిషాలు ఈ మిశ్రమాన్ని ఉడకనిచ్చి దించేస్తే ఘుమ ఘుమ లాడే కమ్మని పప్పు చారు సిద్ధం.